Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి25వఅధ్యాయము

1  పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. 
2  వీరిలో అయిదుగురు బుద్ధి లేనివారు అయిదుగురు బుద్ధిగలవారు. 
3  బుద్ధిలేనివారు తమ దివీటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొని పోలేదు. 
4  బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి. 
5  పెండ్లికుమారుడు ఆలస్యముచేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. 
6  అర్ధరాత్రివేళ - ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 
7  అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని 
8  బుద్ధిలేని ఆ కన్యకలు - మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. 
9  అందుకు బుద్ధిగల కన్యకలు - మాకును మీకున ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. 
10  వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడ సిద్ధపడియున్నవారు అతనితోకూడ పెండ్లివిందుకు లోపలికి పోయిరి; 
11  అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి - అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా 
12  అతడు - మిమ్ము నెరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
13  ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెళకువగా ఉండుడి. 
14  (పరలోకరాజ్యము ) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. 
15  అతడు ఒకనికి అయిదు తలాంతులను1ఒకనికి రెండును ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 
16  అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి మరి అయిదు తలాంతులు సంపాదించెను. 
17  ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. 
18  అయితే ఒక తలాంతు తీసికొనినివాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. 
19  బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. 
20  అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి - అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను. 
21  అతని యజమానుడు - భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని2అతనితో చెప్పెను. 
22  ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి - అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే, అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. 
23  అతని యజమానుడు - భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని2అతనితో చెప్పెను. 
24  తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి - అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును. 
25  గనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. 
26  అందుకు అతని యజమానుడు వాని చూచి - సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను చల్లనిచోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? 
27  అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచవలసియుండెను; నేను వచ్చి వడ్డితో కూడ నా సొమ్ము తీసికొందునే అని చెప్పి 
28  - ఆ తలాంతును వానియొద్దనుండి తీసివేసి పది తలాంతులు గలవానికియ్యుడి. 
29  కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడును. 
30  మరియు పనికిమాలిన ఆ దాసుని వెలపటి చీకటిలోకి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. 
31  తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. 
32  అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పొగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచి 
33  తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. 
34  అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి - నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 
35  నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి; పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; 
36  దిగంబరినై యుంటిని నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. 
37  అందుకు నీతిమంతులు - ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీ కాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? 
38  ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? 
39  ఎప్పుడు రోగివై యుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. 
40  అందుకు రాజు - మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. 
41  అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి - శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని1వాని దూతలకు ను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. 
42  నేను అకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు; 
43  పరదేశినై యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. 
44  అందుకు వారును - ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను దప్పిగొని యుండటయైనను పరదేశివై యుండుటయైనను దిగంబరివై యుండుటయైనను రోగివై యుండుటయైనను చెరలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారము చేయక పోతిమని ఆయనను అడిగెదరు. 
45  అందుకాయన - ఈ మిక్కిలి అల్పులైనవారిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. 
46  వీరు నిత్యశిక్ష పొందను నీతిమంతులు నిత్యజీవము పొందను పోవుదురు
Download Audio File

No comments:

Post a Comment